Tuesday, October 6, 2015

పూర్ణం కుడుములు


కావలసిన పదార్థాలు:
శనగపప్పు - ముప్పావు కప్పు
బెల్లం - ఒక కప్పు
తాజా కొబ్బరి తురుము - 3 టేబుల్‌ స్పూన్లు
యాలకుల పొడి - చిటికెడు
బియ్యంపిండి - ఒకటిన్నర కప్పు, నీళ్లు - తగినన్ని
నెయ్యి - 1 టీ స్పూన్‌, ఉప్పు - చిటికెడు
తయారీ విధానం: శనగపప్పు మునిగేంత నీరు పోసి కుక్కర్‌లో ఉడికించుకోవాలి. పప్పు మరీ మెత్తగా కాకుండా వేళ్లతో నొక్కితే చితికేంత మేరకే ఉడికించుకోవాలి. తడిలేకుండా చూసుకోవాలి. తర్వాత పప్పును చల్లార్చి పొడి చేసుకోవాలి. గిన్నెలో బెల్లం, నీళ్లు పోసి పాకం పట్టాలి. పాకంలో శనగపప్పు పొడి, యాలకుల పొడి, కొబ్బరి తురుము వేసుకుని కలుపుకోవాలి. ఈ మిశ్రమం చిక్కబడే వరకూ సన్నని మంటపై ఉడికించుకోవాలి. మిశ్రమం పిండి ముద్దగా మారాక మంట తీసేయాలి. పూర్తిగా చల్లారాక ఉండలు కట్టుకుని పక్కనుంచుకోవాలి. నీళ్లు, నెయ్యి, ఉప్పు కలిపి మరిగించుకోవాలి. బియ్యంపిండిని ఓ గిన్నెలో తీసుకుని మరిగించిన నీటిని చేర్చుతూ పిండి కలుపుకోవాలి. 2 నిమిషాలాగి వేడిగా ఉన్నప్పుడే పిండి మెత్తబడే వరకూ పిసుక్కోవాలి. చేతికి నూనె పూసుకుని పిండిని ఉండలుగా చేసుకోవాలి. ఉండలను చేత్తో చిన్న పూరీల్లా వత్తుకుని వాటి మధ్యలో శనగ ఉండను ఉంచి గుండ్రంగా చుట్టాలి. ఇలా తయారుచేసిపెట్టుకున్న కుడుములను 10 -12 నిమిషాలపాటు ఆవిరి మీద ఉడికించి చల్లారాక వడ్డించాలి.

0 comments:

Post a Comment