Wednesday, April 10, 2013

గుంత పొంగనాలు

* గుంత పొంగనాలు


ఇది ప్రత్యేకమైన ఉదయం ఫలహారం. వీటిని చేసుకోడానికి గుంతల పెనం మార్కెట్లో దొరుకుతుంది. మూడు రకాల పొంగనాల రుచులు మీకోసం...

సగ్గుబియ్యంతో

కావలసిన పదార్థాలు: సగ్గుబియ్యం- 1/2, కప్పు, బియ్యం - 3/4 కప్పు, మినప్పప్పు - 1/4 కప్పు, మెంతులు - చిటికెడు, పెరుగు -3 టేబుల్ స్పూన్లు, శనగపప్పు- 1 టేబుల్ స్పూను, పచ్చిమిర్చి తరుగు - 1 టీ స్పూను, అల్లం తరుగు - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, ఉల్లి తరుగు - కప్పు.

తయారుచేసే విధానం: సగ్గుబియ్యం, మినప్పప్పు, బియ్యం, మెంతులు కలిపి 6 గంటలు నానబెట్టాలి. తర్వాత నీరు వడకట్టి పెరుగు, ఉప్పు కలుపుతూ చిక్కగా రుబ్బి (అవసరమైతే కొద్ది నీరు వాడొచ్చు) 8 గంటల సేపు పక్కనుంచాలి. తర్వాత కొత్తిమీర, ఉల్లి తరుగు, (5 గంటలపాటు నానబెట్టిన) శనగపప్పుని కలపాలి. చిన్న కడాయిలో కొద్ది నూనె వేసి ఆవాలు, అల్లం, పచ్చిమిర్చి తరుగు తాలింపు వేసి చల్లారాక రుబ్బిన పిండిలో కలపాలి. ఈ మిశ్రమాన్ని (స్పూను చొప్పున నూనె వేసిన) పెనం గుంతల్లో మూడు వంతులు నింపి మూతపెట్టాలి. వేగాక సన్న కాడతో తిప్పుతూ అన్నివైపులా దోరగా వేగించాలి. ఈ పొంగనాలని కొబ్బరిచట్నీతో తింటే చాలా బాగుంటాయి.

మెంతికూరతో

కావలసిన పదార్థాలు:శనగపిండి - ఒకటిన్నర కప్పు, బియ్యప్పిండి - 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లి - 1 కప్పు, మెంతి ఆకులు - 1 కప్పు, పసుపు - చిటికెడు, కారం - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, సోంపు - 2 టీ స్పూన్లు, పంచదార - చిటికెడు, వంటసోడా - అర టీ స్పూను, నూనె - సరిపడా.
తయారుచేసే విధానం: ఒక వెడల్పాటి పాత్రలో బియ్యప్పిండి, శనగపిండి, ఉప్పు, వంటసోడా, కారం, పసుపు, సోంపు, పంచదార చేర్చి తగినన్ని నీళ్లు పోస్తూ చిక్కని జారుగా కలిపి అరగంట పక్కనుంచాలి. తర్వాత ఈ మిశ్రమంలో ఉల్లి తరుగు, మెంతి ఆకులు వేసి నూనె గుంతల్లో ముప్పావు వంతు పోసుకుని అన్నివైపులా తిప్పుతూ వేగించుకోవాలి. వీటిని టమోటా సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.

కొత్తిమీరతో

కావలసిన పదార్థాలు:బియ్యం - 2 కప్పులు, మెంతులు - 1 టీ స్పూను, మినప్పప్పు - 1 కప్పు, ఉల్లి తరుగు - 1 కప్పు, పచ్చికొబ్బరి (చిన్న) ముక్కలు - అరకప్పు, అల్లం+పచ్చిమిర్చి పేస్ట్ - 1 టీ స్పూను, జీలకర్ర - 1 టీ స్పూను, కొత్తిమీర తరుగు - 1 కప్పు, నూనె - సరిపడా, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం: బియ్యం, మినప్పప్పు, మెంతుల్ని ఒక పాత్రలో 8 గంటలు నానబెట్టాలి. తర్వాత మెత్తగా రుబ్బి అల్లం, మిర్చి పేస్ట్, పచ్చికొబ్బరి ముక్కలు, ఉప్పు, ఉల్లి, కొత్తిమీర తరుగు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని గుంతల్లో పోసి, అన్ని వైపులా తిప్పుతూ వేగించాలి. ఇవి పుదీనా చట్నీతో పాటు ఆలు కుర్మాతో తిన్నా బాగుంటాయి.

0 comments:

Post a Comment