Thursday, July 24, 2014

స్వీట్స్ (ఉషారాణి నూతలపాటి )రసగుల్లా

కావలసిన పదార్ధాలు : చిక్కటి పాలు 1 లీటరు , పంచదార అరకిలో ,నిమ్మరసం 1 పెద్దకాయ రసం , చిటికెడు  కుంకుమ పువ్వు , పిస్తా పప్పు కొద్దిగా. (పిస్తా ,కుంకుమ పువ్వు కావాలనుకుంటేనే వాడవచ్చు.)
చేయువిధానం : ముందుగా పాలని బాగా మరగనివ్వాలి. పాలు కాగినంతసేపు మీగడ కట్టకుండా కలుపుతూనేవుండాలి .బాగా మరిగినతరువాత స్టవ్ కట్టేసి , నిమ్మరసం లో ఒక స్పూన్ నీళ్ళు కలిపి , ఆ నిమ్మరసాన్ని పాలల్లో కొద్ది,కొద్దిగా కలుపుతూ వుండాలి .పాలు విరిగేవరకు అలా కలుపుతూ వుంటే పాలు విరిగిపోతాయి . విరిగిన పాలని అలాగే కలిపితే పాలు బాగా విరిగి , నీరు,విరుగు (చెనా ) స్పష్టంగా వేరుపడతాయి . చిల్లుల పళ్ళెం లో పల్చని బట్టవేసి అందులో పాలవిరుగు వెయ్యాలి . చెనా మీద బాగా నీటిని ధారగా పొయ్యాలి ,అప్పుడే నిమ్మరసం పులుపు కూడా పోతుంది. బట్టలోంచి నీరు మొత్తం దిగిపోతుంది. బట్టను మూటలా చేసి ,తేలికగా వత్తితే మిగిలిన నీరు కూడా బయటికి వస్తుంది. 2 గంటలసేపు ఆమూటను వేలాడదీస్తే మొత్తం నీరు దిగిపోయి ,చెనా మిగులుతుంది.
ఇప్పుడు స్టవ్ పైన మందపాటి పాత్రను వుంచి అరలీటరు నీరు పోసి, అందులో చక్కర వేసి , కరిగేవరకూ కలుపుతూ వుండాలి . బాగా కరిగిన తరువాత చక్కెరపాకాన్ని కొద్దిగా చల్లారనివ్వాలి .
చెనా (పాలవిరుగు) ని ఒక పెద్ద ప్లేట్ లో కానీ ,చపాతీ పీటమీద కానీ వేసుకొని , మృదువుగా ,ఉండలు లేకుండా 5.6 నిముషాలసేపు కలపాలి. మృదువుగా ,వుండచేస్తే తేలికగా వుండకట్టేలా తయారు అవుతుంది. మొత్తం చెనాని సమానభాగాలుగా చేసి ,గుండ్రగా ఉండలు చెయ్యాలి. ఒక వెడల్పు పాత్ర స్టవ్ పై వుంచి లీటరు నీరు పోసి మరగనివ్వాలి. మరుగుతున్న నీటిలో చెనావుండలు వేసి మూత పెట్టాలి. 7 ,8 నిముషాలపాటు అలాగే మరగనివ్వాలి .చెనావుండలు బాగా ఉడికి సైజ్ పెద్దగా అవుతాయి వాటిని పాకంలో వేసి చల్లారాక ,ఫ్రిజ్ లో వుంచి చల్లబరచాలి.పాకంలో కావాలనుకుంటే కుంకుమ పువ్వు (శాఫ్రాన్ )వేసుకోవచ్చు.పిస్తా సన్నగా తరిగి రసగుల్లాలమీద అలంకరించుకుంటే అద్భుతః .పాకంలో 2 చుక్కలు వనిల్లా ఎసెన్స్ (కావాలనుకుంటే )లేదా రోజ్ ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. మంచి వాసనతో రుచిగావుంటాయి.
P.S. : ఒక్కోసారి పాలు విరిగిపోతాయి.అప్పుడు కూడా ట్రై చెయ్యవచ్చు. కానీ మరీ పాడయిన పాలు చేదువస్తాయి జాగ్రత్త !!

0 comments:

Post a Comment